Title Picture

భరణీ వారి సరికొత్త చిత్రం 'బాటసారి' అనేక విధాల విశేషంగా, ప్రశంసనీయంగా ఉంది. ఫలితం మాట అటుంచి, అసలు ఒక తెలుగు దర్శక నిర్మాత, ఇప్పటి పరిస్థితులలో, ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించకుండా, చిత్తశుద్ధితో ఇటువంటి విషాదాంత చిత్ర నిర్మాణానికి పూనుకోవడమే విశేషం. ఈ చిత్రంలో ఇంకా ముఖ్యంగా విశిష్టత ఇతివృత్తంలోనే ఉంది. ఈ ఇతివృతం తెలుగు వెండి తెరకు సరికొత్తది. 'బాటసారి' నిర్మాణం దక్షిణాది ఫిలిం రంగంలో పెద్ద సాహసకృత్యం.

Title Picture

'ఇల్లరికం' (రజతోత్సవ) చిత్రాన్ని నిర్మించి ఆంధ్రపేక్షకుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న ప్రసాద్ ఆర్ట్ పిక్చర్సువారు అంతకంటే మరొక మెట్టు ఉన్నతస్థాయిలో భార్యాభర్తలు చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చలన చిత్రాభిమానుల అభిరుచులకు అనుగుణంగా అన్ని హంగులను ఏర్పికూర్చి, అధిక వ్యయప్రయాసల కోర్చి వారు ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారు.

Title Picture

ఇన్నాళ్ళకు తెలుగులో సంతృప్తికరమైన డబ్బింగు చిత్రం ఒక్కటి వచ్చింది. బలంగల కథతో, జవంగల కథనంతో, గతి తప్పని నడకతో, పదునైన మాటలతో 'తల్లిఇచ్చిన ఆజ్ఞ' సంతృప్తికరమైన చిత్రంగా రూపొందింది. దృశ్యం, శ్రవ్యం ఈమధ్య ఏ డబ్బింగు చిత్రంలోనూ కని విని ఎరగనంత చక్కగా సమన్వయించాయి. సహజంగానే కథ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోగలది కావడం వల్ల, దానికి అద్భుతమైన రచన తోడై చాలా సందర్భాలలో ఇది డబ్బింగు చిత్రమన్న విషయాన్ని మరపింపచేస్తుంది.

Title Picture

అసలే తెలుగు చిత్రం, అందులోను డబ్బింగ్ చిత్రం. ఆ పైన జానపద వంటి చరిత్రాత్మక చిత్రం-ఎలా ఉంటుందో ఊహించడం అంత కష్టం కాదు. అందుకే మరీ అమాయకులకు తప్ప ఎవరికీ ఆశాభంగం కలగదు. అధవా కలిగినా అది నిర్మాతల తప్పుకాదు. తమ తప్పేనని ఒప్పుకొని లెంపలు వేసుకుంటారు. "ఔరా! ఈ చిత్రం ఎంత గొప్పగుణపాఠం (దురాశ దుఃఖము చేటు) నేర్పింది!" అని ముక్కుల మీద వేళ్ళు వేసుకుంటారు.

Title Picture
బి.సరోజాదేవి, ఎన్.టి.రామారావు

ఈ చిత్రం ఆర్థికంగా అఖండ విజయం సాధించడమంటూ జరిగితే అందుకు కారణం ముప్పాతికపాళ్ళు ఆత్రేయ గారి కలం చలవేనని చెప్పవలసివస్తుంది. అంతేకాదు, ఆయన కలం ఈ చిత్రంలో విచ్చల విడిగా చిందులు తొక్కిందని కూడా చెప్పక తప్పదు. తెలుగు (సినిమా) తనం ఉట్టిపడే సన్నివేశాలతో, సంభాషణలతో, పాటలు, నృత్యాలు వగైరా హంగులతో ఈ చిత్రం సగటు ప్రయాణా(16 వేల అడుగులు)న్ని అధిగమించింది.

Title Picture

శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ మూసలో తయారయిన 'ఉషాపరిణయం' అను 'బాణాసుర' చిత్రం తెలుగు పౌరాణిక చిత్రాల సగటు స్థాయికి మచ్చుతునక అనదగ్గట్లుగా ఉంది. కడారు నాగభూషణం గారు తమ యావచ్ఛక్తినీ ఈ చిత్రంలో ప్రదర్శించినట్లున్నారు.

Title Picture

ఒక వర్గం వారికి నచ్చేవిధంగా చిత్రం తీస్తే రెండవ వర్గం వారు ఈసడిస్తారు కనుక పక్షపాతం లేకుండా, తెలుగు ప్రేక్షకుల సగటు సంస్కారాన్ని, విజ్ఞానాన్ని, అభిరుచిని అంచనాకట్టి అందుకు అనుగుణమైన హంగులనూ, హంగామాలనూ ఏర్చికూర్చి 'వెలుగు నీడలు' చిత్రాన్ని నిర్మించారు అన్నపూర్ణావారు. సగటు ప్రేక్షకునికి అంగుళం మేర అయినా విసుగుపుట్టకుండా, కొన్ని సందర్భాలలో 'శెభాష్' అని ఈలకొట్టేవిధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో ఉత్తమ చిత్రాలుగా మనం లెక్కవేస్తున్న వాటి కోవలోకి వస్తుంది 'వెలుగు నీడలు' చిత్రం.

Title Picture
ఎం.జి.ఆర్, పద్మిని

ఒక రాజుగారికి పబ్లిక్ గా ఒకరాణి, ప్రైవేటుగా మరొక రాణి ఉంటారు. మొదటి ఆవిడ హిందూస్త్రీ, పట్టమహిషి. రెండో ఆవిడ ముస్లిం స్త్రీ. ఇద్దరూ చెరొక మగపిల్లాణ్ణి కంటారు. ముస్లిం ఆవిడకి కొంచెం ముందు పుడతాడు. అతని పేరు దావూద్ ఖాన్. పట్టమనిషి కొడుకు పేరు దేసింగు. రాజుగారు ముస్లిం భార్యను, బిడ్డతోసహా దొడ్డిదారిని ఆడవికి పంపేస్తాడు. దేసింగు, దావూద్ పెరిగిపెద్దవారై యం.జి. రామచంద్రన్ అంతటి పరాక్రమవంతులవుతారు. అనేక పాటలు, యుద్ధాలు, కుట్రలతో కథ బోలెడు గడిచిన తర్వాత దావూద్ జన్మరహస్యం తెలుస్తుంది. తమ్ముడి మీద పగబడతాడు. దేసింగును చంపననీ, అతనికి తను అన్నననే విషయం చెప్పననీ ఒట్టు వేయించుకుని దావూద్ తల్లి చనిపోతుంది. అక్కడ రాజుగారు కూడా కాలం చేయడంతో దేసింగు రాజు అవుతాడు. తన స్థానాన్ని ఆక్రమించుకొన్న తమ్ముణ్ణి జయించడానికి దావూద్ బయలుదేరుతాడు. చివరికి క్లయిమాక్సు లాగా ఘోరమైన యుద్ధం జరిగి దావూద్ చనిపోతాడు. కయ్యాలు అన్నిటికీ కారకుడైన దమనకుడు వచ్చి 'దావూద్ నీ అన్నే సుమా' అని చెప్పి, దేసింగు చేత కత్తి పోటు తిని మరణిస్తాడు. భరతమాతను, రాజ్యాన్ని, చనిపోయిన సైనికులనూ, ప్రేక్షకులను, ఉద్దేశించి బారెడు స్వగతోపన్యాసం చేసి తను కూడా పొడుచుకుని చనిపోతాడు దేసింగు.

Title Picture
జగ్గయ్య, సావిత్రి

సగటు కంటే తక్కువ నిడివిలో ఈ చిత్రాన్ని ముగించినందుకు దర్శకుని అభినందించక తప్పదు (నిడివి-13,900 మాత్రమే). అయితే ఈ చిత్రాన్ని ఇంకా పొట్టిగా నిర్మించడానికి అవకాశం ఉన్నదనిపిస్తుంది. చిత్రాల నిడివిని తగ్గించితే తెలుగు చిత్రాలకు కొత్తగా వచ్చే అవలక్షణమేమీ ఉండదని ఈ చిత్రం నిరూపిస్తుంది.

Title Picture

తెలుగులో డబ్బింగు చిత్రాల తయారీ లాభసాటి కుటీర పరిశ్రమగా, చిన్న మొత్తాల పొదుపు పథకంగా దినదిన ప్రవర్థమానమవుతున్నది. లక్షలకు లక్షలు వెచ్చించి నిర్మించే చిత్రాలు పట్టుమని పదివారాలైనా మార్కెట్టులో విహరించకమునుపే గూటికి చేరుకొంటున్నాయి. అందుకే మన నిర్మాతలు ఈ అడ్డదారిని ఆశ్రయించారు. ఈ సంవత్సరం ఇంతవరకు 45 చిత్రాలు విడుదలైనాయి. వీటిలో 17 డబ్బింగు చిత్రాలు; ఐదు చిత్రాలు మాత్రం ఇంతవరకు వందరోజులు నడిచాయి. డబ్బింగు చిత్రాలలో రెండు రకాలు ముఖ్యంగా కనుపిస్తున్నాయి. తమిళం నుంచి అనువదించినవి, హిందీ నుంచి అనువదించినవి. కన్నడ చిత్రాలను కూడా అనువదించడం జరుగుతున్నది కాని చాలా అరుదు. అరవ డబ్బింగు చిత్రాల థోరణికీ, హిందీ డబ్బింగు చిత్రాల ధోరణికీ చాలా వ్యత్యాసం ఉంటున్నది. భాషలో ఎంతో వ్యత్యాసం కనుపిస్తున్నది. అరవ చిత్రాల కంటె, హిందీ చిత్రాలనే మన ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నట్లు తోస్తుంది.